తన సినిమా ఆలస్యం కావడంపై సాయి దుర్గా తేజ్ క్లారిటీ
- సాయి దుర్గా తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా 'సంబరాల ఏటిగట్టు'
- ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ రావడం మినహా ఎలాంటి అప్డేట్స్ లేని వైనం
- కొంచెం లేట్ అయినా.. పక్కా కంటెంట్ తో వస్తానన్న తేజ్
మెగా హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’ చుట్టూ టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా రకరకాల రూమర్స్ నడుస్తున్నాయి. షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులు కావడం, గ్లింప్స్ మినహా ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఈ సినిమాపై రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రాజెక్ట్ వాయిదాలపై వస్తున్న పుకార్లకు సాయి దుర్గా తేజ్ తాజాగా ఒక ఈవెంట్లో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా.. 1980ల నాటి రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో, అణచివేతకు గురయ్యే గిరిజనుల కోసం ఎదురుతిరిగే ‘బాలి’ అనే పవర్ఫుల్ గిరిజన నాయకుడి కథాంశంతో వస్తోంది.
సినిమా ఆలస్యంపై తేజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రేక్షకులు ఓటీటీల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో విభిన్నమైన సినిమాలు, వెబ్సిరీస్లను విరివిగా చూస్తున్నారని గుర్తుచేశారు. రకరకాల జానర్లలో వస్తున్న సరికొత్త కంటెంట్ను ఫాలో అవ్వడం వల్ల, ఆడియన్స్కు సినిమా మేకింగ్, కథలపై ఎంతో నాలెడ్జ్ పెరిగిందని, వారి ఆలోచనా విధానంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు.
ప్రేక్షకులకు ఉన్న ఈ నాలెడ్జ్ వల్లే, ఇప్పుడు తన సినిమాల విషయంలో తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తేజ్ వెల్లడించారు. పాతకాలపు రొటీన్ కథలను ఇప్పుడు జనాలు అస్సలు ఆదరించడం లేదని, వారిని మెప్పించాలంటే కథల ఎంపిక, మేకింగ్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించక తప్పదన్నారు. కేవలం సినిమాలు చేయాలనే తొందరతో కాకుండా, ఒక సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ‘సంబరాల ఏటిగట్టు’ విషయంలో లేట్ అయినా సరే.. పక్కా కంటెంట్తోనే వస్తానని స్పష్టం చేశారు.